Vijayashanthi: తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని, అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తాను గణనీయమైన సేవలందించానని విజయశాంతి అన్నారు. 2023లో తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చిందని, వారి మాట ప్రకారం తనకు ఆ అవకాశం లభించిందని తెలిపారు. అయితే, తాను ఈ పదవి కోసం ఎవరిని కోరలేదని, పార్టీ హైకమాండ్ స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిందని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేందుకు పాటుపడుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంత కష్టమైనా, హామీలను అమలు చేయడంలో వెనుకడుగు వేయబోమని విజయశాంతి చెప్పారు.
