National Games: నేషనల్ గేమ్స్ లో తెలుగు మరియు తెలంగాణ అథ్లెట్లు ఒకరి తర్వాత మరొకరు సత్తా చాటుతున్నారు. మిగిలిన మేటి రాష్ట్రాలకు ధీటుగా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ఈసారి క్రీడల్లో అబ్బాయిల కంటే ముఖ్యంగా అమ్మాయిల ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి హ్యాట్రిక్ స్వర్ణాలతో దూసుకుపోతుంది. ఆ వివరాలు కి వెళ్తే…
ఉత్తరాఖండ్ వేదికగా జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్లు చెలరేగుతున్నారు. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యర్రాజి జ్యోతి మహిళల అథ్లెటిక్స్ విభాగంలో మూడో సారి స్వర్ణం సాధించింది. ఈ సారి ఆమె 110 మీటర్ల హర్డిల్స్ ను13.10 సెకన్లలో పరుగును పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచింది. గతంలో 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే విభాగంలో స్వర్ణం గెలుచుకుంది జ్యోతి.
పురుషుల విభాగంలో తేజస్ శిర్సే కూడా మూడో సారి స్వర్ణం సాధించాడు. అతను 110 మీటర్ల హర్డిల్స్లో 13.65 సెకన్లలో పరుగును పూర్తి చేసి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అతను గతంలో 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ స్వర్ణం సాధించాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రోహిత్ రోమన్ పురుషుల డెకథ్లాన్లో కాంస్య పతకం సాధించాడు.
ఇది కూడా చదవండి: NZ v SA: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో విజయం
తెలంగాణకు మరిన్ని పతకాలు వచ్చి చేరాయి. తెలంగాణ మహిళల నెట్ బాల్ టీమ్ కాంస్య పతకం సాధించింది. తెలంగాణ, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 42-42 టైగా ముగిసింది, దీంతో రెండు జట్లకు కాంస్య పతకాలు వచ్చాయి.
మహిళల 4×100 మీటర్ల రిలేలో నిత్య గంధె, అగసర నందిని మంచి ప్రదర్శన చేశారు. నిత్య, నందిని, ఆకుమడుపుల మైథిలి, మాలోతు సింధుతో కూడిన తెలంగాణ జట్టు 47.58 సెకన్లలో పరుగును ముగించి మూడో స్థానంలో నిలిచింది.
