Rahul Gandhi: కేజ్రీవాల్ మోదీలా మారిపోయారు! రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతిని అంతం చేసి, కొత్త రాజకీయ వ్యవస్థను తీసుకురావాలని ప్రకటించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్ చివరికి ప్రధాని నరేంద్ర మోదీలా మారిపోయారని ఆయన ఆరోపించారు.

యమునా నది గురించి సవాల

కేజ్రీవాల్ 2013లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఐదేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తానని హామీ ఇచ్చారని, కానీ పదేళ్లు గడిచినా నది శుద్ధి కాలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. నిజంగా యమునా నది నీరు శుద్ధి అయిందా? అయితే కేజ్రీవాల్ దాన్ని తాగి చూపించాలని సవాల్ విసిరారు. నీరు తాగితే తర్వాత ఆసుపత్రికి వెళ్లి పరామర్శిస్తానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

“కేజ్రీవాల్, మోదీ ఒక్కటే!”

కేజ్రీవాల్‌కి, మోదీకి తేడా లేదని, ఇద్దరూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రెండూ దళితులను దూరంగా ఉంచుతున్నాయని, ఆప్ నాయకత్వంలో ఒక్క దళితుడు కూడా లేదని అన్నారు. కేజ్రీవాల్ సన్నిహితంగా ఉన్న తొమ్మిది మంది నేతల్లో ఒక్కరు కూడా దళిత వర్గానికి చెందిన వారు కాదని తెలిపారు.

ఢిల్లీ ఎన్నికల పోరు – ఐకమత్యం Vs ద్వేషం

ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఐకమత్యం మరియు ద్వేషం మధ్య జరిగే పోరాటమని రాహుల్ గాంధీ అన్నారు. RSS భావజాలంతో దేశంలో ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్న బీజేపీకి, ఐకమత్యాన్ని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌కు మధ్య పోరాటమని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పేరు పదవిలో ఉన్నంత వరకు వినిపిస్తుందని, అయితే ఆయన పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరూ గుర్తు చేసుకోరని అన్నారు. మహాత్మా గాంధీ, నాథూరాం గాడ్సేలలో గాంధీని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, అదే విధంగా భవిష్యత్తులో మోదీని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ఢిల్లీలో రాజకీయ వేడి పెంచాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ చేసిన ఈ ఆరోపణలకు AAP ఎలా స్పందిస్తుందో చూడాలి!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *