Delhi: వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 10న విడుదల కాగా, జనవరి 17 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు కల్పించారు. నామినేషన్ల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాజధానిలో నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది.
ఇప్పటికే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ తన నామినేషన్ను దాఖలు చేశారు. తాజాగా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ రోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కనాట్ ప్లేస్లోని హనుమాన్ మందిరాన్ని సందర్శించిన కేజ్రీవాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఆలోచించి ఓటు వేసేందుకు కేజ్రీవాల్ కోరారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 70 స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుంది. ఫలితాలను ఫిబ్రవరి 8న లెక్కించి ప్రకటించనున్నారు.