Nadendla manohar: వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం, డబ్బులు సక్రమంగా అందించలేదని గణాంకాలు తెలిపినట్లు రాష్ట్ర పౌరసరఫరాలు, ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ, గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఆరోపించారు. అయితే, కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంక్రాంతిని తీసుకువచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడూ రైతుల హితార్థం కోసం ఆలోచిస్తారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
“జనవరి 5వ తేదీ నాటికి ఖరీఫ్ సీజన్లో 4,15,066 మంది రైతుల నుంచి 27,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశాము. బాధ్యతలు విస్మరించిన గత ప్రభుత్వం నాటి ఖరీఫ్లో 2,12,431 మంది రైతుల నుంచి మాత్రమే ధాన్యం సేకరించింది. మా ప్రభుత్వం కేవలం ధాన్యం సేకరించడం మాత్రమే కాదు, 24 గంటల్లో రైతుల ఖాతాలకు నగదు జమ చేస్తోంది. ఇప్పటివరకు ₹6,083.69 కోట్లు చెల్లింపులు చేశాం” అని నాదెండ్ల వివరించారు.
