చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. స్వల్ప అస్వస్తతకు గురైన రజనీకాంత్ను సోమవారం అర్థరాత్రి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు వెళ్లే ప్రధాన రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మంగళవారం ఉదయం ఆయనకు నాన్ సర్జికల్, ట్రాన్స్కాథెటర్ పద్ధతిలో చికిత్స అందించారు. తాజాగా రజనీకాంత్ ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేశారు.
ప్రధాన రక్తనాళంలో స్టెంట్ను ఉంచి వాపును పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. విజయవంతంగా చకిత్స అందించామని మేము ఆయన శ్రేయోభిలాషులకు, అభిమానులకు తెలియజేయాలనుకుంటున్నాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆరోగ్యంగానే ఉన్నారు. రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అవుతారు” అని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ కె వెంకటాసలం ఒక హెల్త్ బులిటెన్ లో తెలిపారు. దీంతో రజనీకాంత్ అభిమానులు ఊపిరి పీల్చకున్నారు. రజనీకాంత్ ఆరోగ్యంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు స్టాలిన్ చెప్పారు.
