KCR Farmhouse Lands

KCR Farmhouse Lands: ఎర్రవల్లిలో మొదలైన ఫామ్‌హౌస్ ల్యాండ్ సర్వే

KCR Farmhouse Lands: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని పేద దళితులకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన మరుసటి రోజే రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి ఇచ్చిన 30 రోజుల గడువు నేపథ్యంలో సిద్ధిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించగా, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కుక్ తహసీల్దార్ సరిత, ఏడీ సుదర్శన్ నేతృత్వంలోని రెవెన్యూ బృందం గురువారం మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఫీల్డ్ విజిట్ చేపట్టింది.

క్షేత్రస్థాయిలో రికార్డుల పరిశీలన – సర్వే నెం. 325పై ఫోకస్

ఎర్రవల్లి, శివారు వెంకటాపురం, వరదరాజుపూర్ గ్రామాల సరిహద్దుల్లోని సర్వే నెంబర్ 325లో ఉన్న అసైన్డ్ భూములపై అధికారులు లోతుగా వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ఆ భూములు ఎవరి పేర్లపై ఉండేవి? ఇప్పుడు రికార్డుల్లో ఎలా నమోదయ్యాయి? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలోని పాత పహాణీలు, 1954 నాటి రికార్డులను ఆర్డీవో చంద్రకళ పరిశీలించారు. ఫామ్‌హౌస్ పరిసరాల్లోని ప్రభుత్వ భూముల హద్దులను సర్వేయర్ల సహాయంతో నిర్ధారించే పనిలో పడ్డారు.
మరోవైపు కబ్జా ఆరోపణలు వచ్చిన భూములను స్వయంగా పరిశీలించేందుకు శుక్రవారం సిద్ధిపేటలో కాంగ్రెస్ ఎంపీల బృందం పర్యటించనుంది. అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై నివేదిక కోరనుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు – 30 రోజుల గడువు..
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై కీలక గణాంకాలను బయటపెడుతూ అధికారులకు స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు. 1944 సర్వే రికార్డుల ప్రకారం ఎర్రవల్లి గ్రామానికి ఆనుకుని 2,447 ఎకరాల భూమి ఉందని, శివారు వెంకటాపురం మధ్య దాదాపు 300 ఎకరాల భూమి 1957 నుంచి వివాదంలో ఉందని రేవంత్ పేర్కొన్నారు. 2017లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన పేరిట ఆ భూమిని కేసీఆర్ తమ ఖాతాలోకి మార్చుకున్నారని ఆరోపించారు.
388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమి మాయం?..
ప్రస్తుతం అధికారిక రికార్డుల ప్రకారం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట 295 ఎకరాల భూమి మాత్రమే ఉందని, అయితే సర్వే నెంబర్ 325లో ఉన్న 388 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమిని రికార్డుల నుంచి తొలగించి మొత్తం 700 ఎకరాల విస్తీర్ణంలో కంచె వేసుకున్నారని సీఎం సవాల్ విసిరారు.
30 రోజుల్లో లెక్క తేలాలి..

“రెవెన్యూ అధికారులకు 30 రోజుల సమయం ఇస్తున్నాం. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు మాత్రమే కాదు, బాధ్యులైన మంత్రులపై కూడా చర్యలు తప్పవు” అని రేవంత్ స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు మొదలుపెట్టిన ఈ విచారణ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకుంటుందనేది రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *