Pawan Kalyan: గత కొద్దిరోజులుగా నిరంతర పర్యటనలు, పని ఒత్తిడి, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందోనని అభిమానులు, జనసైనికులు ఎంతగానో కంగారు పడ్డారు. ఇప్పుడు వాళ్లందరికీ ఒక ఊరటనిచ్చే శుభవార్త! కేరళలోని ప్రకృతి ఒడిలో జరిగిన ప్రత్యేక ఆయుర్వేద చికిత్సతో పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకున్నారు. మునుపటి ఉత్సాహంతో, కొత్త శక్తితో కనిపిస్తున్న జనసేనాని.. ఆంధ్రప్రదేశ్కు తిరిగి రాకముందే కేరళలోని మహిమాన్విత పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో సేదతీరుతున్నారు. సెప్టెంబర్ 15న ఆయన తిరిగి ఏపీకి చేరుకోనుండటంతో, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి పార్టీ కేడర్ ఇప్పటినుంచే సిద్ధమవుతోంది.
వేకువజామున 3 గంటలకే గురువాయూర్ దర్శనం..
శనివారం తెల్లవారుజామున త్రిస్సూర్ జిల్లాలోని ప్రఖ్యాత గురువాయూర్ శ్రీ బాలకృష్ణుని (గురువాయూరప్ప) ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైనది ‘నిర్మాల్య సేవ’. ముందురోజు రాత్రి స్వామివారికి చేసిన అలంకరణతో ఉదయం తొలి దర్శనం చేసుకోవడాన్ని నిర్మాల్య దర్శనం అంటారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు పవన్ వేకువజామున సరిగ్గా 3 గంటలకే ఆలయానికి చేరుకున్నారు.
దక్షిణ ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన పవన్ దాదాపు 30 నిమిషాల పాటు స్వామివారి సేవలో తరించారు. నిర్మాల్య దర్శనం తర్వాత జరిగే తైలాభిషేకం (నువ్వుల నూనెతో), శంఖాభిషేకం, వాకచార్థు సేవలను భక్తిశ్రద్ధలతో వీక్షించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఆలయ ప్రాంగణంలోని గణపతి, ఆంజనేయస్వామి, అనంత పద్మనాభ స్వామి, భగవతి అమ్మవార్లతో పాటు అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం గుడి వెనుక భాగంలో నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు (మేల్ శాంతి) పవన్ను ఆశీర్వదించి స్వామివారి కళభం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
త్రిప్రయార్ శ్రీరాముడి సన్నిధిలో దీపారాధన..
అంతకుముందు శుక్రవారం సాయంత్రం, కేరళలోని ప్రసిద్ధ నాలాంబలం యాత్రలో ప్రధానమైన త్రిప్రయార్ శ్రీరామస్వామి దేవాలయాన్ని పవన్ దర్శించుకున్నారు.
ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న దీపస్తంభాల వద్ద స్వయంగా జ్యోతి ప్రజ్వలన చేశారు.ఒక రోజు దీపారాధన సేవకు అవసరమైన విరాళాన్ని స్వయంగా సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం చేపలకు ఆహారం వేసే ‘మీనూట్టు’ (Meenoottu), శత్రుదోష నివారణకు చేసే ‘వెడివళిపాడు’ (క్రాకర్స్ పేల్చే పూజ) వంటి ఆచారాలను పూర్తి నిష్ఠతో నిర్వహించారు.
వెంట వచ్చిన ఆయుర్వేద వైద్యులు..
పవన్ కళ్యాణ్కు కొన్ని రోజులుగా సాంప్రదాయ కేరళ పంచకర్మ, ఆయుర్వేద థెరపీలు చేసిన వైద్య బృందం కూడా ఆయనతో పాటే గురువాయూర్ ఆలయాన్ని సందర్శించడం విశేషం. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు, విశ్రాంతి తీసుకున్న ఆయన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, నూతనోత్తేజంతో కనిపిస్తున్నారు.
సెప్టెంబర్ 15న ఏపీకి ఎంట్రీ – లోకల్ పోరుపై ఫుల్ ఫోకస్..
కేరళ ఆధ్యాత్మిక యాత్ర ముగించుకుని సెప్టెంబర్ 15న పవన్ కళ్యాణ్ అమరావతికి చేరుకోనున్నారు. రాగానే ఆయన పాలనా వ్యవహారాలతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా గ్రామాల అభివృద్ధిపై వేగవంతమైన సమీక్షలు చేపట్టడంతో పాటు, కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.



