Viral News

Viral News: సబ్స్క్రైబ్ చేసుకో.. తిరుపతి లడ్డూ తీసుకో!

Viral News: తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని సోషల్ మీడియాలో సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ కోసం విచ్చలవిడిగా వాడుకుంటున్న వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారుతోంది. “నా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే తిరుపతి లడ్డూతో పాటు వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కూడా ఉచితం” అంటూ వరుస వీడియోలు నెట్టింట ప్రత్యక్షమవడం భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి తన ఫేస్‌బుక్ వేదికగా ఈ తరహా వీడియోలను పోస్ట్ చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది.

షేర్, కామెంట్ చేస్తే లడ్డూల బాక్స్ ఉచితం..

మొదటి వీడియోలో ఒక్కొక్కరితో తన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయిస్తూ, అందుకు ప్రతిఫలంగా ఒక్కొక్కరికీ ఒక్కో లడ్డూను అందజేశారు. అలా దాదాపు 30 మందికి 30 లడ్డూలు అంటూ వీడియో లో చెప్పుకొచ్చాడు.
  • రెండో వీడియోలో మరో ఆఫర్:
    ఆ తర్వాత విడుదల చేసిన మరో వీడియోలో.. తన ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని, వీడియోను లైక్, కామెంట్ ఇంకా షేర్ చేసిన వారికి నేరుగా తిరుపతి లడ్డూల బాక్స్‌నే పంపిస్తామంటూ తన చేతిలో ఉన్న లడ్డూల పెట్టెను ప్రదర్శిస్తూ ఆఫర్ ప్రకటించారు.

భక్తుల ఆగ్రహం – టీటీడీ విజిలెన్స్ విచారణకు డిమాండ్:

  • భారీగా లడ్డూలు ఎలా వచ్చాయి..?
    తిరుమలలో ప్రసాదాల జారీకి పక్కా నిబంధనలు, పరిమితులు అమలులో ఉండగా.. సదరు వ్యక్తి వద్దకు ఇన్ని బాక్సుల కొద్దీ అధికారిక టీటీడీ లడ్డూలు ఎలా చేరాయనే దానిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • ప్రసాదం వ్యాపారీకరణపై చర్యలు..

    లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వీకరించే స్వామివారి దివ్య ప్రసాదాన్ని ఇలా సోషల్ మీడియా పబ్లిసిటీ కోసం ఎరగా మార్చడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది టీటీడీ లడ్డూల దుర్వినియోగమేనని, సదరు వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ విభాగం తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *