Jaggery Prices: పండుగల సీజన్ ప్రారంభం కాకముందే వంటింటికి చేదు వార్త ఎదురైంది. ఇప్పటికే చక్కెర ధరలు పెరిగి ఆందోళన కలిగిస్తుండగా, తాజాగా బెల్లం ధరలు (Jaggery Prices) కూడా రికార్డు స్థాయికి చేరి సామాన్యుల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ముంబై ఏపీఎంసీ (APMC) హోల్సేల్ మార్కెట్లోనే నాణ్యతను బట్టి కిలో బెల్లం ధర రూ. 80 నుంచి రూ. 100 వరకు పలుకుతుండగా, రిటైల్ దుకాణాల్లో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
గణేష్ చతుర్థి, దసరా, దీపావళి వంటి పండుగల సమయానికి బెల్లం వినియోగం విపరీతంగా పెరిగే నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల వినియోగదారులతో పాటు స్వీట్ తయారీదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.
రెండు వారాల్లోనే 25-30% పెరిగిన ధరలు..
-
ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాల్లో పెరుగుదల: దేశంలోనే అత్యధికంగా బెల్లం ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గత రెండు వారాల్లోనే బెల్లం ధరలు 25 నుంచి 30 శాతం వరకు పెరిగాయి.
-
చక్కెరతో పాటే పరుగులు: చక్కెర కొరత, అధిక డిమాండ్ వల్ల చక్కెరతో పాటే బెల్లం ధరలు కూడా భారీగా పుంజుకున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
-
మిఠాయిల తయారీ భారం: పండుగల వేళ సంప్రదాయ పిండివంటలు, లడ్డూలు, నైవేద్యాల తయారీలో బెల్లం ప్రధాన పదార్థం కావడంతో స్వీట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు – 2027 వరకు ఇలాగే ఉంటాయా?..
-
చెరకు దిగుబడి తగ్గుముఖం: వర్షాభావ పరిస్థితులు మరియు తెగుళ్ల కారణంగా ప్రస్తుత సీజన్లో చెరకు ఉత్పత్తి తగ్గడం ప్రధాన కారణంగా మారింది. వచ్చే ఏడాది కూడా చెరకు లభ్యత పరిమితంగానే ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
-
కొత్త దిగుబడుల వరకు వేచిచూడాల్సిందే: అక్టోబర్ నెలలో కొత్త చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభమై మార్కెట్లోకి నూతన స్టాక్ వచ్చే వరకు బెల్లం ధరల్లో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
