పోలీసుల కథనం ప్రకారం.. కోస్గి పట్టణానికి చెందిన ఒక ప్రముఖ బంగారం వ్యాపారి కుమారుడు సాయికృష్ణ స్థానికంగా జ్యువెలరీ షాప్ నడుపుతున్నాడు. ఈయన ఇంట్లో స్థానిక ప్రాంతానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి పని మనిషిగా ఉంటోంది.
ఆ యువతిపై కన్నేసిన సాయికృష్ణ.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి లోబరుచుకున్నాడు. ఈ క్రమంలో సదరు యువతి ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అయింది. ఈ విషయం కాస్తా బయటపడటంతో బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై, నిందితుడి ఇళ్లకు వెళ్లి ప్రశ్నించారు.
రాజకీయ ఒత్తిళ్లు – డబ్బుల సెటిల్మెంట్కు యత్నం:
బాధితురాలి తరఫు వారు నిలదీయడంతో, సాయికృష్ణ తండ్రి స్థానిక పెద్ద మనుషులు ఇంకా కొంతమంది రాజకీయ నాయకులతో తెరవెనుక మంతనాలు ప్రారంభించారు.
బాధితురాలికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి కేసును అక్కడికక్కడే నొక్కేయాలని చూశారు. అయితే ఆ యువతి డబ్బులకు లొంగకుండా.. “సాయికృష్ణ నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు అడిగితే నన్ను కులం పేరుతో దూషిస్తున్నాడు” అంటూ శనివారం రోజు కోస్గి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది.
తొలుత రాజకీయ నేతలు ‘మేము మాట్లాడుకుని సమస్య సర్దుబాటు చేస్తాం’ అని పోలీసులకు చెప్పడంతో శనివారం కేసు నమోదు కాలేదు. కానీ, బాధితురాలు ఇంకా దళిత సంఘాల ఒత్తిడి పెరగడంతో ఆదివారం రాత్రి నిందితుడు సాయికృష్ణపై అట్రాసిటీ అలాగే లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం నారాయణపేట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
రంగంలోకి డీఎస్పీ – ముమ్మర విచారణ:
ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారడంతో సోమవారం రాత్రి నారాయణపేట డీఎస్పీ (DSP) లింగయ్య స్వయంగా కోస్గిలో విచారణ చేపట్టారు.
డీఎస్పీ స్వయంగా సదరు బంగారం వ్యాపారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. అలాగే బాధితురాలి కుటుంబం నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నిందితుడు సాయికృష్ణ గత ప్రవర్తన ఎలా ఉండేది? దుకాణం చుట్టుపక్కల వారి అభిప్రాయాలు ఏంటి? అనే కోణంలో ఆరా తీశారు. ఈ కేసు గురించిన పూర్తి నివేదికను జిల్లా ఎస్పీ (SP) కి అందజేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.