Supreme Court: సుప్రీంకోర్టు ఇటీవల పెళ్లికి ముందు ఉండే శారీరక సంబంధాలపై ఒక సంచలన తీర్పును ఇచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన, వారి క్యారెక్టర్ బాగాలేదని తప్పుబట్టలేమని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రేమించిన ప్రతి బంధం కచ్చితంగా పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని, పెళ్లి చేసుకోలేదన్న ఒకే ఒక్క కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్టు కాదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ తీర్పు వెనుక ఉన్న అసలు కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని గజ్వేల్కు చెందిన గాజుల తిరుపతి అనే యువకుడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతను ఉద్యోగ దరఖాస్తు ఫారమ్లో తనపై గతంలో ఉన్న ఒక క్రిమినల్ కేసు వివరాలను నిజాయితీగా పేర్కొన్నాడు. తన గ్రామానికి చెందిన ఒక యువతితో అతను నాలుగేళ్ల పాటు ప్రేమాయణం సాగించాడు. అయితే, ఆ తర్వాత తిరుపతి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో, సదరు యువతి తిరుపతితో పాటు అతని తల్లిదండ్రులపై కూడా కేసు పెట్టింది.
ఈ పాత కేసును సాకుగా చూపిస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.. తిరుపతి క్యారెక్టర్ బాగాలేదంటూ అతనికి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని నిరాకరించింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తిరుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరుపతికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
రెండు వైపులా అంగీకారం ఉన్నప్పుడు దానిని నైతిక పతనంగా చూడలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. తిరుపతిని పోలీస్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఒక వ్యక్తి నిజాయితీగా తన వివరాలు వెల్లడించినప్పుడు, పాత వ్యక్తిగత విషయాలను బూచిగా చూపి ఉద్యోగాన్ని తిరస్కరించడం తగదని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.
