Ramoji Rao Death Anniversary

Ramoji Rao Death Anniversary: మీడియా రంగంలో ఓ యుగకర్త.. అక్షర యోధుడు.. రామోజీరావు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ ఘననివాళులు!

Ramoji Rao Death Anniversary: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఘననివాళులు అర్పించారు. స్వయంకృషితో అత్యున్నత స్థాయికి చేరి, తెలుగుజాతికి ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిన ఆ మహనీయుని సేవలను వారు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

మీడియా రంగంలో ఓ యుగకర్త: సీఎం చంద్రబాబు నాయుడు

రామోజీరావు గారి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను ఒక ‘అక్షర యోధుడు’గా అభివర్ణించారు.

తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు శ్రీ రామోజీరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి, మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయం. విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్యసాహసాలతో నడిచిన ఆయన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తి అని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

పత్రికా రంగం అంటే కేవలం వ్యాపారం కాదు… అదొక సామాజిక బాధ్యత అని భావించి, దానిని ఆచరించి చూపిన ఆదర్శవాది రామోజీరావు గారని చంద్రబాబు కొనియాడారు. తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి మీడియా సంస్థలను అందించిన ఆయన స్థానం ప్రజల హృదయాల్లో శాశ్వతమని, ఆయన కీర్తి అజరామరమని సీఎం పేర్కొన్నారు.

వివిధ రంగాలలో చెరగని ముద్ర: మంత్రి నారా లోకేశ్

మరోవైపు మంత్రి నారా లోకేశ్ కూడా రామోజీరావు గారి బహుముఖ ప్రజ్ఞను కొనియాడుతూ ట్వీట్ చేశారు.

పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా పలు రంగాలలో ఆయన తనదైన చెరగని ముద్ర వేశారని శ్లాఘించారు. ‘ఈనాడు’ పత్రిక ద్వారా తెలుగు ప్రజల జీవితాల్లో సరికొత్త చైతన్య వెలుగులు నింపిన మహోన్నత దార్శనికుడు రామోజీరావు గారు అని లోకేశ్ పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *