Future City: తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ)ని కేవలం ఒక నగరంగానే కాకుండా.. రాబోయే రోజుల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్కు ప్రధాన వేదికగా మార్చేలా అడుగులు పడుతున్నాయి.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారంలో ఒకరోజు ఫ్యూచర్ సిటీ నుంచే సీఎం తన అధికారిక పాలనను సాగించనున్నారు.
ఫ్యూచర్ సిటీలో సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రత్యేక ఛాంబర్లు!
ఫ్యూచర్ సిటీలో నిర్మితమవుతున్న అధునాతన ఎఫ్సీడీఏ (FCDA – Future City Development Authority) భవనం ఇకపై రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారనుంది.
ఈ భవనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా ప్రత్యేక ఛాంబర్లను కేటాయించనున్నారు. ముఖ్యంగా ఐటీ (IT), పరిశ్రమల శాఖల కార్యకలాపాల కోసం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో ఒకరోజు సీఎం, డిప్యూటీ సీఎం తో పాటు ఉన్నతాధికారులు ఇక్కడే అందుబాటులో ఉండి పాలన సాగిస్తారు.
గ్లోబల్ కంపెనీలతో చర్చలన్నీ అక్కడే!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలను ఫ్యూచర్ సిటీకే రప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇకపై విదేశీ కంపెనీల ప్రతినిధులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో (Investors) నిర్వహించే అన్ని రకాల ఉన్నత స్థాయి సమావేశాలు, చర్చలు, పెట్టుబడి ఒప్పందాలకు (MOUs) ఫ్యూచర్ సిటీయే ప్రధాన వేదిక కానుంది. ఎఫ్సీడీఏ భవనంలోని ప్రత్యేక ఛాంబర్లలోనే ఈ ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపి, అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోనున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్!
హైదరాబాద్లోని పాతబస్తీ, సికింద్రాబాద్, సైబరాబాద్ల తర్వాత సరికొత్తగా రూపుదిద్దుకుంటున్న ఈ ఫ్యూచర్ సిటీని ‘ఫోర్త్ సిటీ’ (Fourth City) గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నగరాన్ని గ్లోబల్ హబ్గా మార్చడం కోసం జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఫ్యూచర్ సిటీ బ్రాండింగ్’ (Branding) కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో నిర్మిస్తున్న ఈ నగరం, రాబోయే రోజుల్లో దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడుల కేంద్రంగా నిలుస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
