Gold Price Today: పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తిస్తున్న బంగారం, వెండి ధరలు కాస్త శాంతించాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న పసిడి, వెండి ధరలకు తాజాగా బ్రేకులు పడ్డాయి. జూన్ 4వ తేదీ ఉదయం సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిత్యం హెచ్చుతగ్గులకు గురయ్యే ఈ ధరలు కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తున్నాయి. అయితే ఇవి ఉదయం నమోదైన ధరలు మాత్రమేనని, మార్కెట్ పరిస్థితులను బట్టి రోజులో ఎప్పుడైనా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ నగరాలలో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,210 లుగా ఉంది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190 వద్ద ట్రేడవుతోంది. దేశంలోని మిగతా ముఖ్య నగరాలైన ముంబై, బెంగళూరులలో కూడా సరిగ్గా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలో ధరలు కొంచెం అటుఇటుగా ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,56,360 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,43,340 గా నమోదైంది. ఎప్పుడూ దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే చెన్నైలో ఈసారి కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,58,170 పలుకుతుండగా, 22 క్యారెట్ల ధర రూ.1,44,990 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికి వస్తే.. ప్రాంతాన్ని బట్టి ధరల్లో కాస్త తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాలలో కిలో వెండి ధర రూ.2,89,900 వద్ద విక్రయించబడుతోంది. అదే సమయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలలో కిలో వెండి ధర కాస్త తక్కువగా రూ.2,79,900 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు, దేశంలో వెండికి విపరీతంగా డిమాండ్ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వెండి దిగుమతులను తగ్గించడానికి నిబంధనలను కఠినతరం చేసింది. ఇకపై వెండి రేణువులు, పొడి, 99.9 శాతం స్వచ్ఛత గల వెండి వస్తువులను దేశంలోకి తేవాలంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నుండి ముందస్తు అనుమతి తప్పనిసరి చేసింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, రూపాయి విలువపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం ఈ గట్టి చర్యలు చేపట్టింది.
