Gujarat Titans Bus Fire: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అహ్మదాబాద్లో ఒక ఊహించని ప్రమాదం జరిగింది. రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రయాణిస్తున్న అధికారిక బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆటగాళ్లంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో క్రికెట్ అభిమానులు, ఫ్రాంచైజీ ఊపిరి పీల్చుకున్నారు. మైదానంలో ట్రోఫీ చేజారిన బాధలో ఉన్న జట్టుకు ఈ ప్రమాదం మరింత ఆందోళన కలిగించింది.
ఆదివారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిసి బస్సులో హోటల్కు బయలుదేరారు. కానీ, స్టేడియం దాటి కొద్ది దూరం వెళ్లగానే బస్సులోని విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు లోపల దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆటగాళ్లు ఒక్కసారిగా కంగారుపడ్డారు.
పరిస్థితిని గమనించిన బస్సు డ్రైవర్, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వాహనాన్ని పక్కకు ఆపి, ఎమర్జెన్సీ కిటికీల ద్వారా ఆటగాళ్లందరినీ సురక్షితంగా కిందికి దించేశారు. అయితే, రాత్రి వేళ కావడంతో వేరే వాహనం వెంటనే అందుబాటులోకి రాలేదు. దీంతో కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్టు సభ్యులంతా దాదాపు గంటపాటు రోడ్డుపైనే వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మేనేజ్మెంట్ వేరే బస్సును ఏర్పాటు చేసి వారిని హోటల్కు చేర్చింది.
ఇదిలా ఉంటే, గుజరాత్ జట్టుకు గత కొన్ని రోజులుగా వరుస ప్రయాణాలు పెద్ద శాపంగా మారాయి. మే 27న ధర్మశాల నుంచి ముల్లాన్పూర్ వెళ్లడం, మే 29న క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడటం, ఆ తర్వాత వాతావరణం బాలేకపోవడంతో విమానం ఆలస్యమై శనివారం అర్ధరాత్రి దాటాక అహ్మదాబాద్ చేరుకోవడం వంటి కారణాల వల్ల ఆటగాళ్లు తీవ్రంగా అలసిపోయారు. ఈ నిద్రలేమి, అలసట వల్లే గుజరాత్ జట్టు ఫైనల్లో కేవలం 155 పరుగులకే పరిమితమైందా? అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది.
ఈ విషయంపై గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందిస్తూ.. వరుస ప్రయాణాల వల్ల ఆటగాళ్లు అలసిపోయిన మాట నిజమేనని ఒప్పుకున్నారు. అయితే, దాన్ని సాకుగా చూపిస్తూ బెంగళూరు జట్టు సాధించిన గొప్ప విజయాన్ని తక్కువ చేయలేమని ఆయన అన్నారు. తాము తక్కువ స్కోరు చేసినా బౌలర్లు చివరి వరకు పోరాడారని, ప్రత్యర్థి బాగా ఆడినప్పుడు అంగీకరించక తప్పదని సోలంకి స్పష్టం చేశారు. ఏదేమైనా, ఈ పెద్ద ప్రమాదం నుండి ఆటగాళ్లంతా క్షేమంగా బయటపడటం అందరికీ పెద్ద ఉపశమనం కలిగించింది.
