RCB vs GT: ఐపీఎల్ 2026 మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. గత రెండు నెలలుగా క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ హంగామా ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మే 31 (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఫైట్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఉత్కంఠభరితమైన ఫైనల్ కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో, ఈ మ్యాచ్లో గెలిచేది ఎవరు? పిచ్ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
గెలిచే అవకాశం ఎవరికి ఎక్కువ?
రికార్డులు, గణాంకాల (Stats) పరంగా చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అయితే, గుజరాత్ టైటాన్స్కు ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఉంది. అదేంటంటే.. మ్యాచ్ జరుగుతోంది వారి హోమ్ గ్రౌండ్లోనే! లక్ష మందికి పైగా వచ్చే సొంత ఊరి ప్రేక్షకుల మద్దతు శుభ్మన్ గిల్ టీమ్కు కొండంత బలాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే, ఈ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ కప్ గెలిచే అవకాశాలు 54 శాతం ఉన్నాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లే!
అహ్మదాబాద్ స్టేడియంలో రాత్రి పూట మంచు (Dew) ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచు వల్ల సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం కష్టంగా మారుతుంది. బ్యాటింగ్కు పిచ్ బాగా అనుకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఆలోచించకుండా మొదట బౌలింగ్ ఎంచుకుంటాడు. ఇక్కడ చేజింగ్ చాలా ఈజీ కాబట్టి, టాస్ గెలిచిన జట్టుకే ట్రోఫీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పరుగుల జాతరే..!
ఈ రెండు జట్లలోనూ ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్నారు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ, గుజరాత్లో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ లాంటి క్లాస్, మాస్ ప్లేయర్లు ఫుల్ ఫామ్లో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం 190కి పైగా పరుగులు చేసే అవకాశం ఉందని ట్రెండ్స్ చెబుతున్నాయి.
మరి ఈ రసవత్తర పోరులో విరాట్ కోహ్లీ సేన టైటిల్ను నిలబెట్టుకుంటుందా? లేక సొంత గడ్డపై శుభ్మన్ గిల్ కప్ కొడతాడా? తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
