Puttaparthi: ఆంధ్రప్రదేశ్ రక్షణ మరియు పారిశ్రామిక రంగ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పుట్టపర్తి వేదికగా భారత రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా AMCA (Advanced Medium Combat Aircraft) ప్రాజెక్టుకు పునాది పడింది.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి యుద్ధ విమానాల తయారీలో అత్యంత కీలకమైన ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ (IFTC)కు భూమిపూజ నిర్వహించారు. సుమారు రూ. 15,800 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నారు.
ఏరో కాంప్లెక్స్ మరియు ఉపాధి అవకాశాలు
ఈ ప్రాజెక్టు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా మలుపు తిప్పనుంది.
సుమారు 350 ఎకరాల్లో ఈ భారీ ఏరో కాంప్లెక్స్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా దాదాపు 7,500 మందికి పైగా నిపుణులకు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. AMCAతో పాటు డిఫెన్స్ ఇంకా డ్రోన్ రంగాలకు సంబంధించిన మరో 12 కీలక ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపన చేశారు.
అమెరికా, రష్యా ఫైటర్ జెట్లకు పోటీగా..
భారత్ స్వదేశీ సాంకేతికతతో రూపొందిస్తున్న AMCA యుద్ధ విమానం ప్రపంచంలోనే అత్యుత్తమ ఐదో తరం (5th Gen) ఫైటర్ జెట్ల జాబితాలో చేరనుంది. అమెరికాకు చెందిన F-35 ఇంకా రష్యాకు చెందిన Su-57 వంటి అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలకు దీటుగా భారత్ ఈ AMCAను సిద్ధం చేస్తోంది. పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం, ఈ ఫైటర్ జెట్కు సంబంధించి అన్ని రకాల సాంకేతిక పరీక్షలు ఇంటిగ్రేషన్ పనులకు ప్రధాన కేంద్రంగా (Hub) మారనుంది.
