Petrol And Diesel Price Hike

Petrol And Diesel Price Hike: వచ్చే రోజులో మరింత పెరగనున్నపెట్రొల్,డీజిల్ ధరలు..? కిచెన్ పైన పడిన భారం..!

Petrol And Diesel Price Hike: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో, దేశీయ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, శుక్రవారం పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 3 మేర పెంచడం గమనార్హం.

ఈ ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 97.77కి చేరగా, డీజిల్ ధర రూ. 90.67 వద్దకు చేరుకుంది.హైదరాబాద్ లో 107 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇపుడు రూ.110.78 చేరింది.అలాగే డీజిల్ రూ.98.96 చేరింది.

ధరల పెంపునకు గల కారణాలు

పశ్చిమ ఆసియా (ఇరాన్-ఇజ్రాయెల్) సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాలో అనిశ్చితి నెలకొంది. దీనివల్ల ముడి చమురు ధరలు పెరిగి, భారతదేశ దిగుమతి బిల్లుపై భారం పడుతోంది. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో, ఈ ధరల పెంపు చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, అంతర్జాతీయంగా పరిస్థితి చక్కబడకపోతే రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సామాన్యుడి బడ్జెట్‌పై చూపే ప్రభావం

ఇంధన ధరల పెంపు కేవలం వాహనదారులకే కాకుండా, సమాజంలోని ప్రతి వర్గంపై గొలుసుకట్టు ప్రభావం (Ripple Effect) చూపుతుంది.

  • ప్రయాణ ఖర్చులు: పెట్రోల్ ధరల పెంపుతో సొంత వాహనాలు వాడేవారిపై భారం పడుతుంది. డీజిల్ ధర పెరగడం వల్ల బస్సులు, ట్రక్కుల రవాణా ఖర్చులు పెరిగి ఆటో, క్యాబ్ ఛార్జీలు ఇంకా సరుకు రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.

  • నిత్యావసరాల ధరలు: భారతదేశంలో ఆహార సరఫరా వ్యవస్థ ప్రధానంగా రోడ్డు రవాణాపైనే ఆధారపడి ఉంది. డీజిల్ ధరల పెంపు వల్ల కూరగాయలు, పండ్లు, పాలు ఇంకా నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చు పెరుగుతుంది. ఇది నేరుగా సామాన్యుడి వంటగది బడ్జెట్‌పై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే అమూల్, మదర్ డెయిరీ వంటి సంస్థలు పాలకు లీటరుకు రూ. 2 పెంచడం ఇందుకు నిదర్శనం.

  • ఆన్‌లైన్ షాపింగ్: ఫుడ్ డెలివరీ యాప్స్, ఈ-కామర్స్ సంస్థలు తమ లాజిస్టిక్స్ ఖర్చులను తట్టుకోవడానికి డెలివరీ ఛార్జీలను పెంచడం లేదా డిస్కౌంట్లను తగ్గించే అవకాశం ఉంది.

  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ: వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు, ఇరిగేషన్ పంపులకు డీజిల్ వాడకం అత్యధికం. ఇంధన ధరల పెంపు వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థిక నిపుణుల విశ్లేషణ

ప్రస్తుత పరిస్థితుల్లో చమురు సరఫరా ఖరీదైనదిగా మారింది. ధరలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేకపోతే, భవిష్యత్తులో అది కొరతకు ఇంకా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది,” అని ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ అహ్లువాలియా అభిప్రాయపడ్డారు.

పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికి (Inflation) దారితీసి, సామాన్యుల కొనుగోలు శక్తిని తగ్గించే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *