Kerala New CM: కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా తెరదించింది. మాజీ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ పార్టీ తుది నిర్ణయం తీసుకుంది.
హైకమాండ్ కీలక భేటీ
న్యూఢిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ భేటీ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మీడియాకు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఉత్కంఠభరిత ఎంపిక
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల వంటి సీనియర్ నేతల పేర్లు వినిపించినప్పటికీ, పార్టీ అధిష్ఠానం మాత్రం వీడీ సతీశన్ వైపు మొగ్గు చూపింది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఆయన చూపిన చొరవ, పార్టీని విజయపథంలో నడిపిన తీరును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలు ఒకసారి చూస్తే:
-
యూడీఎఫ్ (UDF): 102 స్థానాలు (మొత్తం 140 స్థానాలకు గాను).
-
ఎల్డిఎఫ్ (LDF): 35 స్థానాలు.
-
ఇతరులు: 03 స్థానాలు.
భారీ మెజారిటీతో విజయం సాధించిన 10 రోజుల తర్వాత, సుదీర్ఘ కసరత్తు ముగించి కేరళ సారథ్య బాధ్యతలను సతీశన్కు అప్పగించారు.
