Bandi Bhageerath: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తాజాగా తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. గతంలో తనపై నమోదైన ఒక కేసు విషయంలో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన పోక్సో (POCSO) కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో, ఈ అత్యవసర పిటిషన్ను వెకేషన్ బెంచ్లో వేశారు. ఈ వినతిని పరిశీలించిన న్యాయస్థానం, దీనిపై విచారణను ఈనెల 14వ తేదీకి ఖరారు చేసింది. ఆ రోజున వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్ను విచారించి, బెయిల్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనుంది.
గతంలో ఒక విద్యార్థిపై దాడి చేసిన వ్యవహారంలో భగీరథ్పై ఈ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుల నుండి ఉపశమనం పొందడానికి ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. 14వ తేదీన జరిగే విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
