Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అధికారిక అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం ఆయన రాజకీయ మిత్రులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో మానవీయ కోణంతో పాటు రాజకీయ వ్యూహాలు కూడా స్పష్టంగా కనిపించాయి. హ్యాట్రిక్ విజయం తర్వాత తొలిసారి నగరానికి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది.
పవన్ కల్యాణ్ను పరామర్శించిన మోదీ
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ వెళ్లడం విశేషం. ఇటీవల పవన్ కల్యాణ్ ఒక చిన్న సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోవడానికి మోదీ ఆయన నివాసానికి వెళ్లారు. కొంతసేపు పవన్తో ఏకాంతంగా గడిపిన ప్రధాని, ఆయన కోలుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ పట్ల మోదీ చూపిన ఈ ఆత్మీయత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చంద్రబాబు నివాసంలో భేటీ
అక్కడి నుండి ప్రధాని మోదీ నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు.
పరేడ్ గ్రౌండ్లో కాషాయ గర్జన
పర్యటనలో భాగంగా చివరిగా ప్రధాని మోదీ సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే మైదానం జనసందోహంతో నిండిపోయింది. వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు చేశారు.
