Revanth Reddy

Revanth Reddy: ఢిల్లీ వేదికగా డీలిమిటేషన్ సెగ.. దక్షిణాది గళాన్ని వినిపించిన సీఎం రేవంత్ రెడ్డి.

Revanth Reddy: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గళాన్ని విప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును, డీలిమిటేషన్‌ను కలిపి చూపించి రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ రెండు వేర్వేరు అంశాలని, వీటిని విడదీసి చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అనుకూలమేనని, అయితే కేంద్రం దీనిని సాకుగా చూపి దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేలా కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మహిళా బిల్లుపై కాంగ్రెస్ ముద్ర
మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీయే పునాది వేసిందని సీఎం గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన నాడే మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత తమ పార్టీదేనన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చామని, సోనియా గాంధీ నాయకత్వంలోనే రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిందని ఆయన వివరించారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం 2026 జనాభా లెక్కల తర్వాతే ఈ బిల్లు అమలవుతుందని చెప్పడం మహిళలను వంచించడమేనని, 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం
నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసి జనాభాను అదుపులో ఉంచినందుకు మాకు శిక్ష వేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు భారీగా పెరుగుతాయని, తద్వారా దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో నొక్కేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్ మోడల్’ ప్రతిపాదన
ఈ సమస్య పరిష్కారానికి రేవంత్ రెడ్డి ఒక కొత్త ‘హైబ్రిడ్ మోడల్’ను ప్రతిపాదించారు. కేంద్రం పెంచాలనుకుంటున్న సీట్లలో 50 శాతం జనాభా ప్రాతిపదికన, మిగిలిన 50 శాతం ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధి (GSDP) ప్రాతిపదికన కేటాయించాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తూ, భారీగా పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. కేవలం జనాభానే ప్రామాణికంగా తీసుకుంటే అది దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
నియోజకవర్గాల విభజన వంటి సున్నితమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకూడదని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, నిపుణుల కమిటీని వేసి అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో దీనిపై చర్చించాలని డిమాండ్ చేశారు. 2028 మార్చి నాటికి ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయవచ్చని, అంతవరకు తొందరపాటు నిర్ణయాలు వద్దు అని ఆయన కేంద్రాన్ని కోరారు. ఉత్తర-దక్షిణ విభేదాలను సృష్టించేలా కేంద్రం వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *