Commercial Cylinder: అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం దేశీయంగా ఇంధన ధరలపై పడటం మొదలైంది. ఏప్రిల్ 1వ తేదీ బుధవారం నుండి వాణిజ్య అవసరాలకు వినియోగించే (Commercial) ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఈ పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు నడిపే వ్యాపారులపై ఈ భారం గట్టిగా పడనుంది.
రూ. 195.50 పెరిగిన సిలిండర్ ధర
తాజా సవరణ ప్రకారం, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 195.50 పెరిగింది. ఈ పెంపుతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది. గత మార్చి 1వ తేదీన కూడా చమురు సంస్థలు ఈ సిలిండర్పై రూ. 114.5 పెంచిన సంగతి తెలిసిందే. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే వాణిజ్య గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. ఇండియన్ ఆయిల్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ రేట్లను బట్టి ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలను సవరిస్తుంటాయి.
గృహ వినియోగదారులకు ఊరట
కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, ఇళ్లలో వాడుకునే 14.2 కిలోల వంటగ్యాస్ (Domestic LPG) ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడం గమనార్హం. గత మార్చి 7న గృహ వినియోగ సిలిండర్పై రూ. 60 పెరిగిన తర్వాత, ప్రస్తుతం అవే ధరలు కొనసాగుతున్నాయి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు ప్రస్తుతానికి కొంత ఉపశమనం లభించినట్లయింది.
స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 50 శాతం మేర పెరిగాయి. ఈ ప్రభావం గ్యాస్ ధరలపై కనిపిస్తున్నప్పటికీ, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మాత్రం గత కొంతకాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. గతేడాది మార్చిలో లీటరుకు రూ. 2 తగ్గించిన తర్వాత కేంద్రం మళ్ళీ ధరలను సవరించలేదు.
అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధరల పెంపు ప్రభావం పరోక్షంగా హోటల్ తినుబండారాల ధరలపై పడే అవకాశం ఉంది.
