Chandrababu Naidu

Chandrababu Naidu: సొంతింటి సాకారం దిశగా అడుగులు.. 2029 లోపు అందరికీ ఇళ్లు

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల సొంతింటి కలపై కీలక ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్న సీఎం, స్వయంగా వారికి ఇంటి తాళాలు అందజేశారు. 2029వ సంవత్సరం లోపు రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని ఆయన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడతలో భాగంగా సుమారు 2.5 లక్షల మంది పేదలకు ఈ గృహప్రవేశాలు కల్పించడం విశేషం.

ప్రభుత్వం నిర్మించిన ఈ టిడ్కో ఇళ్లు కేవలం నివాసాలు మాత్రమే కాదని, ప్రైవేట్ అపార్ట్‌మెంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునిక వసతులతో కూడి ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. జీ+3 (నాలుగు అంతస్తులు) విధానంలో నిర్మించిన ఈ కాలనీల్లో పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు మరియు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. గత 21 నెలల్లోనే రెండు విడతలుగా మొత్తం 5.5 లక్షల ఇళ్లను పేదలకు అందించగలిగామని, రాబోయే కాలంలో మరో 17.60 లక్షల ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. పేదల జీవితాల్లో ఈ ఇళ్లు కొత్త వెలుగులు నింపుతాయని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గత వైకాపా ప్రభుత్వంపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో గృహ నిర్మాణ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. విశాఖలో ప్యాలెస్‌లు కట్టుకున్న నాయకులు, పేదలకు ఇళ్లు కట్టించడంలో మాత్రం నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. స్మశానాల్లో, కొండ ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించి పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. తాము నిర్మించిన మంచి ఇళ్లను కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని, ఇప్పుడు వాటన్నింటినీ మళ్ళీ గాడిలో పెడుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

కేవలం గృహ నిర్మాణమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాదిలోనే 5 లక్షల మంది యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అమరావతి రాజధానిని హైదరాబాద్, చెన్నై నగరాల కంటే అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో నెలకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, స్థానిక మత్స్యకారులకే ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *