Crime News: 9 నెలలు కడుపులో మోసి కన్న పిల్లలంటే ఏ తల్లికైనా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. పిల్లలకి చిన్న గీత పడినా ఆమెకే తాకినట్టు విలవిలలాడుతుంది. కానీ తిరుపతి జిల్లాలో ఓ తల్లి తన బిడ్డని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చంపడానికి గల కారణం వింటే ఆమె పైన ఎవరికైనా కోపం రావడం పక్కా. కేవలం ఏడుపు ఆపడం లేదని చంపేసింది. ఆమెకి ఏదైనా మానసిక సమస్యలు ఉన్నాయా? భర్త పైన కోపంతోనే బిడ్డని చంపేసిందా? ఈ కేసులో ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.
తిరుపతి జిల్లా సత్యవేడులో నివసిస్తున్న వెంకటేష్, హేమావతి దంపతులు.. వీళ్లకి ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. తమిళనాడులోని వెంగలచేరి నుండి వీళ్ళు ఉపాధి కోసం సత్యవేడు పరిసర ప్రాంతాలకు వలస వచ్చారు. ఇక్కడ సిమెంట్ ఇటుకల తయారీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ జంటకి రుత్విక్ అనే ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అలాగే 5 నెలల చిన్నారి ఉంది.
ఈ దంపతుల మధ్య పెళ్లైనప్పటి నుండి తరచుగా చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉండేవి. తరచుగా జరుగుతున్న గొడవలతో హేమావతి ఎప్పుడూ కోపంగా ఉండేది.. అలా కోపంగా ఉన్న సమయంలో 5 నెలల చిన్నారి ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది. ఆ పరిస్థితిలో ఉన్న ఏ తల్లికైనా చిన్నారికి ఆకలి వేస్తుందని తెలుస్తుంది, వెంటనే పాలు ఇచ్చి ఏడుపు ఆపుతారు. కానీ ఈమె మాత్రం చిన్నారి ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియకుండా, ఏడుపు ఆపేందుకు నోరు ముక్కు మూసింది. ఊపిరి ఆడక చిన్నారి మృతి చెందింది.
ఈ ఘటన గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. కన్నతల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పక్కన ఉండే జనాలు ఆమె మానసిక సమస్యలతో బాధపడుతుందని, తరచుగా కోప్పడుతూనే ఉంటుందని పోలీసులకు చెప్పారు. ఈ విషయాన్ని తల్లి హేమావతి సైతం పోలీసుల ముందు అంగీకరించింది. భర్తతో జరుగుతున్న గొడవలే ఈ హత్యకి కారణమా..? లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
వచ్చిన కోపాన్ని ఆపుకోలేకపోవడంతో ఓ చిన్నారి 5 నెలలకే తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
