Excise Duty: పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరల నుండి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 13 నుండి రూ. 3కి తగ్గించగా, డీజిల్పై లీటరుకు రూ. 10 నుండి ఏకంగా సున్నాకి (0) తగ్గించింది. అంటే రెండు ఇంధనాలపై లీటరుకు రూ. 10 చొప్పున పన్ను భారం తగ్గింది.
అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో..
అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది.
-
హోర్ముజ్ దిగ్బంధనం: ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
-
భారత్ వ్యూహం: యుద్ధానికి ముందు భారత్ తన చమురు అవసరాల్లో 12-15% ఈ మార్గం ద్వారానే పొందేది. ఇప్పుడు సరఫరా తగ్గడంతో దేశీయంగా ధరలు పెరగకుండా ఉండేందుకు కేంద్రం తన పన్ను ఆదాయాన్ని వదులుకుని వినియోగదారులకు ఈ లబ్ధిని చేకూర్చింది.
ఎవరికి ఎంత లాభం?
ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై (IOCL, BPCL, HPCL) ఒత్తిడి తగ్గడమే కాకుండా, సామాన్యుడి జేబుకు ఊరట లభిస్తుంది.
-
పెట్రోల్: లీటరుపై రూ. 10 సుంకం తగ్గడంతో రీటైల్ ధరలు దిగివచ్చే అవకాశం ఉంది.
-
డీజిల్: రవాణా రంగానికి కీలకమైన డీజిల్పై పన్నును పూర్తిగా తొలగించడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
-
రాష్ట్రాల స్పందన: కేంద్రం సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటా VATని తగ్గిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ధరల నియంత్రణకు మోదీ సర్కార్ కసరత్తు
చమురు సంక్షోభంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు భయాందోళనతో ముందస్తు కొనుగోళ్లు (Panic buying) చేయవద్దని కేంద్రం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. పన్ను తగ్గింపు నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి సుమారు రూ. 80,000 కోట్ల భారం పడనుంది.
