Hyderabad: హైదరాబాద్లోని మద్యం ప్రియులకు పోలీసులు ఒక చేదు వార్త చెప్పారు. రేపు (మార్చి 27, శుక్రవారం) శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. భాగ్యనగరంలో భక్తిభావంతో జరిగే ఈ వేడుకల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మాత్రమే కాకుండా, స్టార్ హోటళ్లలోని బార్లను కూడా మూసివేయాలని స్పష్టం చేశారు. ఈ సమయాన్ని ‘డ్రై డే’గా ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.
ముందస్తుగా క్యూ కడుతున్న మద్యం ప్రియులు:
రేపు రోజంతా మద్యం షాపులు బంద్ ఉంటాయన్న వార్త తెలియడంతో, మందుబాబులు ఇప్పుడే వైన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. రేపటి కోటాను కూడా ఈరోజే కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకునే పనిలో పడ్డారు. దీనివల్ల నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. పండుగ వేళ ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకూడదని, ఎవరైనా దొంగచాటుగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
శ్రీరామనవమి శోభాయాత్రలు, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం ఈ చర్యలు చేపట్టింది. కాబట్టి నగరవాసులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరుతున్నారు.
