Crime News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక దారుణమైన హత్యోదంతం రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేటలో శోభ అనే మహిళను హత్య చేసిన నిందితుడు నర్సింహులు, ఆమె మృతదేహాన్ని బైక్పై పెట్టుకుని సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి తరలించాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
సహజీవనం.. ఆపై హత్య
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మృతురాలు శోభ, నిందితుడు నర్సింహులు గత కొంతకాలంగా మహబూబ్నగర్లోని వీరన్నపేటలో సహజీవనం చేస్తున్నారు. అయితే వీరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన నర్సింహులు, శోభను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.
మృతదేహంతో కిలోమీటర్ల మేర ప్రయాణం
హత్య చేసిన తర్వాత దొరికిపోతామనే భయంతో మృతదేహాన్ని ఎక్కడైనా పారవేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఒక దుప్పటిలో చుట్టి, బైక్ ముందు భాగంలో వేసుకున్నాడు. అర్ధరాత్రి వేళ మహబూబ్నగర్ నుంచి బయలుదేరి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ మృతదేహాన్ని పారవేసి ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి తప్పుకున్నాడు.
సీసీటీవీ పుటేజీతో దొరికిపోయిన నిందితుడు
మర్నాడు స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆ మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. ఒక వ్యక్తి బైక్పై అనుమానాస్పదంగా భారీ మూటతో వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు చిక్కాయి. ఆ బైక్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా, అది నర్సింహులుదిగా తేలింది. వెంటనే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారించగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మృతదేహంతో అన్ని కిలోమీటర్ల దూరం బైక్పై ప్రయాణించడం నిందితుడి క్రూరత్వానికి నిదర్శనమని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
