Revanth Reddy: సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. వచ్చే 2029 ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ ఎమ్మెల్యేను కచ్చితంగా రాష్ట్ర మంత్రిని చేస్తామని ఆయన భారీ హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న ఈ ప్రాంత రాజకీయాల్లో మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రజలు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్కు అవకాశం ఇస్తే, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే బాధ్యతను తాను, మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి తీసుకుంటామని బహిరంగంగా ప్రకటించారు.
రాజకీయంగా ప్రత్యర్థులతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజలకు జరిగే మేలు విషయంలో తాను వెనకడుగు వేయనని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని పేదలకు అన్యాయం జరగనివ్వనని చెబుతూ, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజకీయాల కోసం సామాన్య ప్రజలను, ముఖ్యంగా దళితులు, గిరిజనులు మరియు వెనుకబడిన వర్గాల వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. ఇది తమ ప్రభుత్వ నిష్పక్షపాత పాలనకు నిదర్శనమని రేవంత్ రెడ్డి వివరించారు.
సిద్దిపేటలో నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై వస్తున్న విమర్శలకు సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను అనుకుంటే ఈ పరిశ్రమను తన సొంత నియోజకవర్గం కొడంగల్కు తరలించుకోవచ్చని, కానీ ఇక్కడి రైతుల ప్రయోజనాల కోసమే సిద్దిపేటలోనే కొనసాగిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో కొడంగల్కు జరిగిన అభివృద్ధి కంటే, గత 24 నెలల్లో తాము ఈ ప్రాంతానికి ఇచ్చిన నిధులు ఎంతో లెక్క తీయడానికి సిద్ధమని సవాలు విసిరారు. తాము ఎమ్మెల్యేల కోసం కాకుండా, కేవలం ప్రజల బాగు కోసమే పనిచేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసే విషయంలో గత ప్రభుత్వానికి, తమకు ఉన్న తేడాను సీఎం వివరించారు. గతంలో మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టుల కోసం రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని, కానీ తాము కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం 98 శాతం రైతులతో మాట్లాడి, వారికి నష్టపరిహారం పెంచి మరీ భూసేకరణ చేశామని చెప్పారు. రైతు కన్నీరు పెట్టని సాగునీటి ప్రాజెక్టులే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 1984 నుండి ఒకే కుటుంబానికి ఇక్కడ అవకాశం ఇచ్చారని, ఈసారి మార్పు కోసం కాంగ్రెస్ను ఆదరించాలని సిద్దిపేట ప్రజలను ఆయన కోరారు.
