Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాగు పెట్టుబడి కోసం ఇచ్చే ‘రైతు భరోసా’ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఈ ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సుమారు 9 వేల కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా 3,590 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది.
డబ్బులు ఎప్పుడు జమవుతాయంటే:
రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉండగా, మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులందరికీ ఈ సాయం అందుతుంది. ఆదివారం విడుదలైన ఈ నిధులు ముందుగా ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చేరుతాయి. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో, సోమవారం ఉదయం నుంచి రైతుల వ్యక్తిగత ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది. మొదటి విడత పూర్తయిన 20 రోజుల తర్వాత రెండో విడతలో 2,650 కోట్లు, ఆ తర్వాత మూడో విడతలో 2,760 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.
నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం:
రైతు భరోసా నిధుల విడుదలతో పాటు, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. దీనివల్ల స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, మరో 80 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పామాయిల్ రిఫైనరీ ప్లాంట్కు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
వ్యవసాయ అభివృద్ధికి పెద్దపీట:
రాష్ట్రంలోని రైతుల్లో దాదాపు 24.32 లక్షల మందికి ఎకరం లోపు భూమి ఉండగా, 48.68 లక్షల మందికి ఎకరం కంటే ఎక్కువ భూమి ఉంది. అందరికీ దశలవారీగా సాయం అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా, పారిశ్రామికంగా కూడా రైతులను ఆదుకునేందుకు ఇలాంటి ఫ్యాక్టరీలను అందుబాటులోకి తెస్తున్నామని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
