Revanth Reddy

Revanth Reddy: కొత్త ఏడు.. కొత్త వెలుగులు.. రాష్ట్ర ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ తెలుగు నూతన సంవత్సరం రాష్ట్రంలో ‘రైతు నామ సంవత్సరం’గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే రైతులకు, రైతు కూలీలకు ఉగాది ఒక గొప్ప పండుగ అని కొనియాడారు. మన రాష్ట్రంలో రైతులను రాజులుగా చూడాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పండించిన పంటలకు బోనస్ అందిస్తూ, రైతులు తక్కువ అప్పులతో ఉండాలన్నదే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణలో సుమారు 70 శాతం కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని, అందుకే అన్నదాతలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు రుణమాఫీ ద్వారా రైతులు ఆత్మగౌరవంతో బతికేలా చర్యలు తీసుకున్నామని, అలాగే ‘రైతు భరోసా’ పథకాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలతో పాటు భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ‘భూ భారతి’, ‘ధరణి’ వంటి సేవలను మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు ఏవీ రాకుండా, పంటలు బాగా పండి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *