Telangana: కరీంనగర్ జిల్లాలో ఒక విషాదకర ఘటన వెలుగుచూసింది. నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోనే గన్నేరు పప్పు దంచుకుని తిన్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన పోలీస్ అధికారి కుటుంబంలో ఈ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.
అసలేం జరిగిందంటే?
కరీంనగర్ వన్ టౌన్ పరిధిలోని హనుమాన్ నగర్లో ఎస్సై చంద్రశేఖర్ తన భార్య దివ్య మరియు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్య గన్నేరు పప్పును దంచుకుని తిన్నట్లు తెలుస్తోంది. అది తిన్న కొద్దిసేపటికే ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం గమనించిన భర్త చంద్రశేఖర్ వెంటనే ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ మృతి..
కరీంనగర్ ఆసుపత్రిలో దివ్య పరిస్థితి విషమించడంతో, మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూనే దివ్య ప్రాణాలు కోల్పోయారు. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు బిడ్డలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆత్మహత్యకు గల కారణం?
దివ్య ఆత్మహత్యకు కడుపు నెప్పే కారణమని ఆమె భర్త చంద్రశేఖర్ చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారని, ఆ నొప్పిని భరించలేకనే ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ధైర్యంగా ఉండాలని, ఇలా ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని ఈ ఘటన మరోసారి అందరినీ కలచివేస్తోంది.
