Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడిన ఆయన, తదుపరి పీసీసీ చీఫ్గా సీనియర్ నేత జగ్గారెడ్డిని నియమించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యల కోసం పోరాడే మాస్ లీడర్ అని కోమటిరెడ్డి కొనియాడారు.
జగ్గారెడ్డి పనితీరును మాజీ నేత పీజేఆర్తో పోల్చిన కోమటిరెడ్డి, ఆయనకు ఆపదలో ఉన్న వారిని ఆదుకునే గుణం ఉందని ప్రశంసించారు. జగ్గారెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 100 సీట్లు గెలుచుకోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.
