HJ Dora: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్జే దొర శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం డయాలసిస్ చేయించుకోవడానికి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన ఆయన, ప్రమాదవశాత్తు బాత్రూమ్లో జారి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను తిరిగి ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
హెచ్జే దొర 1943లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. 1965 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న ఆయన, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా బాధ్యతలు చేపట్టారు. సుమారు ఆరేళ్ల పాటు డీజీపీగా కొనసాగి, రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వంలోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2002లో సీఐఎస్ఎఫ్ (CISF) డీజీగా నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం, కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఆయన్ను నియమించింది. క్రమశిక్షణకు, అంకితభావానికి మారుపేరుగా నిలిచిన హెచ్జే దొర మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీస్ ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
