KTR: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K. Taraka Rama Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విటర్ లో ట్వీట్ తో స్పందించారు. ఈ తీర్పును “ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి”గా అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను అధికార పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
ప్రజల తీర్పును అవమానించడమే!
ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవన్న స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు
బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, అదే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. ఇంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలి?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారికి క్లీన్ చిట్ ఇవ్వడం అంటే, ఓటు వేసిన ప్రజల తీర్పును నిలువునా అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.
ఫిరాయింపులకు ప్రోత్సాహం
స్పీకర్ కార్యాలయం ఫిరాయింపులను అడ్డుకోవాల్సింది పోయి, వాటిని ప్రోత్సహించేలా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కి, రాజకీయ లబ్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న వారు తమకు అనుకూలంగా వ్యవస్థలను మలుచుకుంటున్నారని, ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చెడు సంప్రదాయానికి తెరలేపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న వారికి సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
న్యాయ పోరాటం కొనసాగుతుంది
స్పీకర్ ఇచ్చిన ఈ తీర్పుపై తాము ఇక్కడితో ఆగిపోమని, న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ ఇచ్చిన ఈ క్లీన్ చిట్ను ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మార్చి 16 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతామని ఆయన పేర్కొన్నారు.
