Minimum Balance: దేశంలోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులు సామాన్య ఖాతాదారుల నుంచి మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేదనే సాకుతో భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గత మూడేళ్లలో (2022-23 నుండి 2024-25 మధ్య) బ్యాంకులు ఏకంగా రూ. 19,000 కోట్లను కస్టమర్ల ఖాతాల నుంచి కట్ చేశాయి. ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంకులు ఈ విషయంలో ముందు వరుసలో ఉండటం గమనార్హం.
ప్రైవేట్ బ్యాంకుల వాటానే ఎక్కువ
బ్యాంకు ఖాతాలో కనీస నిల్వ లేదన్న కారణంతో ముక్కుపిండి వసూలు చేస్తున్న ఈ ఛార్జీల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్మలమ్మ తెలిపిన లెక్కల ప్రకారం ప్రైవేట్ బ్యాంకులు వసూలు చేసిన జరిమానాలు ఇలా ఉన్నాయి:
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC): ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన ఈ బ్యాంక్ ఏకంగా రూ. 3,872 కోట్లు వసూలు చేసింది.
-
యాక్సిస్ బ్యాంక్ (Axis): రూ. 2,706 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
-
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI): రూ. 1,225 కోట్లను ఖాతాదారుల నుంచి వసూలు చేసి మూడో స్థానంలో నిలిచింది.
-
ప్రభుత్వ బ్యాంకులు: పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) అత్యధికంగా రూ. 1,578 కోట్లు జరిమానాగా వసూలు చేసింది.
ఎస్బీఐ కస్టమర్లకు భారీ ఊరట
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రం ఈ విషయంలో తన కస్టమర్లకు గొప్ప ఊరటనిచ్చింది. 2020వ సంవత్సరం నుంచే ఎస్బీఐ మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై జరిమానాలను పూర్తిగా ఎత్తేసింది. దీనివల్ల కోట్ల మంది సామాన్య ఖాతాదారులకు ఆర్థిక భారం తప్పింది. ఇతర బ్యాంకులు కూడా ఎస్బీఐ బాటలోనే పయనించి, ఈ జరిమానాలను తొలగించాలని ఇప్పుడు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది.
నియంత్రణ అవసరం
ఖాతాలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న పేదలపై మళ్లీ పెనాల్టీల భారం వేయడం ఎంతవరకు సమంజసమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. బ్యాంకులు పారదర్శకంగా వ్యవహరించాలని, నిబంధనలకు అనుగుణంగానే ఛార్జీలు వసూలు చేయాలని ఆర్థిక మంత్రి సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ విషయంలో జోక్యం చేసుకుని, సామాన్యులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
