Lavanya Tripathi: ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యారు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గుర్తు తెలియని వ్యక్తులు సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్యకరమైన మెసేజ్లు, కామెంట్లతో తనను వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
లావణ్య త్రిపాఠి ఫిర్యాదు ప్రకారం.. ‘పర్పుల్ క్రెయాన్’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి గత కొన్ని రోజులుగా ఆమెకు వ్యక్తిగత దూషణలు ఎదురవుతున్నాయి. తన గౌరవానికి భంగం కలిగించేలా, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఆ అకౌంట్ నిర్వాహకులు పోస్ట్లు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా చేస్తున్న ఈ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద ఈ కేసును ఫైల్ చేశారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సెలబ్రిటీలకే కాకుండా సామాన్యులకు కూడా ఇలాంటి వేధింపులు ఎదురైతే వెనకాడకుండా ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు.
