Revanth Reddy: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను ప్రభుత్వం తరపున ఆయన ఘనంగా సన్మానించారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కీలక శాఖల్లో మహిళా అధికారులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు.
మహిళా సాధికారతకు పెద్దపీట
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, దేశానికి మహిళా ప్రధానిని, రాష్ట్రపతిని, స్పీకర్ను అందించిన ఘనత తమ పార్టీదేనని సీఎం గుర్తుచేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన శాఖలను మహిళా అధికారులే సమర్థంగా నడిపిస్తున్నారని, ఇటీవల మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలోనూ వారు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.
మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో విక్రయించేందుకు అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వాటి నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించామని చెప్పారు.
2026 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల నగరం
హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.
-
ఆర్టీసీ బస్సులు: 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం ప్రకటించారు.
-
ఆటోలు & స్కూటీలు: పాత ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చడంతో పాటు, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
-
పరిశ్రమల తరలింపు: కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెలుపలకు తరలించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళన – రాజకీయాలు వద్దు
మూసీ నది ప్రక్షాళనపై వస్తున్న విమర్శలపై సీఎం ఘాటుగా స్పందించారు. నదుల బఫర్ జోన్లలో (50 మీటర్ల పరిధిలో) ఎలాంటి కట్టడాలకు అనుమతి లేదని, అలాంటి నిర్మాణాలు ఉంటే తొలగించక తప్పదని హెచ్చరించారు.
-
విపక్షాలకు సవాల్: దోమలను నియంత్రించాలంటారు.. కానీ మూసీని శుభ్రం చేయొద్దంటారు.. ఇది ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు అనుకూలమో కాదో రాజకీయ పార్టీలు స్పష్టం చేయాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని హితవు పలికారు.
