Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం వల్ల ధరలు విపరీతంగా పెరిగి, త్వరలోనే తులం బంగారం రూ. 2 లక్షలకు చేరుకుంటుందని అందరూ భయపడ్డారు. కానీ, మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ గత ఐదు రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. యుద్ధ భయంతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనా, పసిడి ధరలు మాత్రం ఊరటనిచ్చేలా పడిపోవడం విశేషం.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ధరల పరిస్థితి చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 మేర తగ్గి రూ. 1,62,110 కి చేరుకుంది. నిన్నటి వరకు ఇది రూ. 1,62,880 గా ఉండేది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. నిన్న రూ. 1,49,300 వద్ద ఉన్న ధర, నేడు రూ. 1,48,600 వద్ద కొనసాగుతోంది. కేవలం హైదరాబాద్లోనే కాకుండా విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే రకమైన తగ్గుదల కనిపిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 770 తగ్గి రూ. 1,62,260 వద్ద ట్రేడ్ అవుతోంది. బెంగళూరులో కూడా ఇవే ధరలు కొనసాగుతుండటంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నా, ప్రస్తుతం ధరలు తగ్గడం అనేది సామాన్యులకు పెద్ద ఊరట అని చెప్పాలి.
బంగారంతో పాటే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2,94,900 వద్ద కొనసాగుతుండగా, ఢిల్లీలో మాత్రం రూ. 2.85 లక్షల వద్ద ఉంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఇలా ధరలు తగ్గడం వల్ల నగల దుకాణాలు కస్టమర్లతో సందడిగా మారే అవకాశం ఉంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే మరిన్ని కనిష్ట ధరలను చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
