Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలను వెల్లడించారు. ముఖ్యంగా రోడ్ల విస్తరణ పనుల సమయంలో అడ్డంకిగా ఉన్నాయని 100 నుండి 140 ఏళ్ల నాటి భారీ వృక్షాలను నరికేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పురాతన చెట్లను కాపాడుకోవడానికి వచ్చే నెల రోజుల్లోగా ఒక ప్రత్యేక పాలసీని (విధానాన్ని) తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
కేవలం మొక్కలు నాటడమే కాకుండా, వాటిని బతికించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పవన్ కల్యాణ్ తెలిపారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్రాకింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, దీనివల్ల మొక్కల సంరక్షణలో జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పారు. రాజమండ్రిలో కొత్తగా నర్సరీని ప్రారంభించామని, ఎర్ర చందనం సాగు, దాని ధరల నిర్ణయంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సభకు వివరించారు. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు ఇచ్చిన సానుకూల సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కూడా డిప్యూటీ సీఎం పలు కీలక విషయాలు పంచుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద సిమెంట్ రోడ్లు, స్మశాన వాటికలు, పశువుల షెడ్ల నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య ఉన్న 3000 గ్రామాలను గుర్తించామని, ‘జల జీవన్ మిషన్’ ద్వారా ప్రతి ఇంటికి నీరు అందించే పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన పథకాలతో పాటు, కొత్తగా మరికొన్ని మల్టీ విలేజ్ స్కీమ్స్కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
చివరగా, పంచాయతీల పునర్వ్యవస్థీకరణ విషయంలో ఎలాంటి కోర్టు కేసులు అడ్డంకిగా లేవని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్ ల ఏర్పాటుపై స్పందిస్తూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే వీటిని ఏర్పాటు చేస్తామని సభ్యులకు భరోసా ఇచ్చారు. అడవి తల్లి బాట, పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
