Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి అసలు పరిపాలన చేయడం రావడం లేదని ఆయన విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పదేపదే బదిలీ చేస్తూ ప్రభుత్వం వారిని మానసిక ఆందోళనకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. అధికారులు ఒక ప్రాంతంలో పరిస్థితులను అర్థం చేసుకునేలోపే వారిని మార్చేయడం వల్ల రాష్ట్రంలో పాలన పూర్తిగా కుంటుపడుతోందని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే ఐదుసార్లు భారీ ఎత్తున అధికారుల బదిలీలు చేపట్టడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ (GHMC) వంటి కీలక విభాగంలో ఇప్పటికే నలుగురు కమిషనర్లను మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ప్రేమగా కాకుండా, బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని హరీశ్రావు హితవు పలికారు.
ముఖ్యమంత్రికి లేదా మంత్రులకు ఎవరైనా అధికారులు నచ్చకపోతే వెంటనే వారిని బదిలీ చేస్తున్నారని, ఇది అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. కొందరికి పోస్టింగులు ఇచ్చినప్పటికీ, విధుల్లో చేరనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. చివరగా, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతి పనులు, వారి బినామీల వివరాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని హరీశ్రావు హెచ్చరించారు.
