Vikarabad: వికారాబాద్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. కష్టపడి చదివి, పోలీస్ యూనిఫామ్ వేసుకుని సమాజానికి సేవ చేయాల్సిన ఒక మహిళా కానిస్టేబుల్ అర్ధాంతరంగా తనువు చాలించింది. వికారాబాద్ పట్టణంలోని గంగారం ప్రాంతంలో నివాసం ఉంటున్న దివ్య అనే మహిళా కానిస్టేబుల్, తన ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె ధారూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఆత్మహత్యకు ముందు దివ్య రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. “అమ్మా నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు. కేవలం మానసిక ఒత్తిడి భరించలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను” అని ఆమె ఆ లేఖలో పేర్కొంది. ఆరేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రిని తలచుకుంటూ.. “నాన్న ఉంటే బాగుండు అమ్మ, నాన్న లేకపోవడం వల్లే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నీకు భారం కాకూడదనే వెళ్లిపోతున్నాను” అని దివ్య రాసిన మాటలు ఆమె మనసులో ఉన్న బాధను తెలియజేస్తున్నాయి.
దివ్య నేపథ్యం పరిశీలిస్తే, ఆమె ఎంతో కష్టపడి పైకి వచ్చినట్లు తెలుస్తోంది. 2020 బ్యాచ్కు చెందిన ఈమె, హైదరాబాద్లోని అంబర్పేటలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆమె తండ్రి బసవరాజ్ కూడా గతంలో హోంగార్డుగా పనిచేసి మరణించారు. ముగ్గురు కుమార్తెలలో చిన్నమ్మాయి అయిన దివ్యకు ఎస్సై (SI) అవ్వాలనే బలమైన కోరిక ఉండేది. కానీ, అంతలోనే ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు, తోటి కానిస్టేబుళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా వేధించారా లేదా కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కారణమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. వికారాబాద్ సీఐ రఘు కుమార్ గారు కేసును పర్యవేక్షిస్తున్నారు. చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్న యువతి ఇలా ప్రాణాలు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
