Hyderabad: హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ మరియు విద్యార్థిని కోమలి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో ఉన్న తన మామ నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ (BSC) చదువుతున్న కోమలి, పార్ట్ టైమ్లో యూట్యూబ్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమ వ్యవహారంలో తలెత్తిన విభేదాలే ఈ బలవన్మరణానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
ప్రేమ.. బ్రేకప్.. మనస్తాపం
పోలీసులు మరియు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోమలి గత మూడేళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్ రెడ్డితో ప్రేమలో ఉంది. అఖిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్లో వీడియోలు చేసేవాడు. అయితే, వీరిద్దరి మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది.
అఖిల్తో విడిపోయినప్పటి నుండి కోమలి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం కూడా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. తన ప్రియుడు మళ్లీ తన వద్దకు రావాలని కోరుకుంటూ కోమలి ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కొండపైకి కాలినడకన వెళ్తూ, ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి తన భక్తిని చాటుకుంది.
వైరల్గా మారిన ఆఖరి వీడియో
కోమలి ఆత్మహత్యకు ముందు తిరుమల మెట్లు ఎక్కుతున్న దృశ్యాలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అతనితో మళ్లీ కలిసి ఉండేలా చూడాలి అనే ఆశతో ఆమె చేసిన ఈ వీడియోనే ఇప్పుడు ఆమె చివరి వీడియోగా మిగిలిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇంకా అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఇలా ప్రేమ కోసం ప్రాణాలు వదలడం అందరినీ కలచివేస్తోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటనపై సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోమలి ఆత్మహత్యకు అఖిల్ రెడ్డి వేధింపులు ఏమైనా కారణమా? లేదా కేవలం విరహం వల్లనే ఈ నిర్ణయం తీసుకుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోమలి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు, అందులోని చాటింగ్ మరియు కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.
