Adulterated Milk: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిని కల్తీపాల కలకలం వణికిస్తోంది. నగరంలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారిలో మరణాల సంఖ్య మంగళవారం (ఫిబ్రవరి 24, 2026) నాటికి ఐదుకు చేరింది. తాజాగా ఆదిలక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె కూడా తీవ్రమైన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇప్పటికే ఈ ఘటనలో నలుగురు వృద్ధులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతున్నారు.
అసలేం జరిగింది?
కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలోని వరలక్ష్మీ మిల్క్ డెయిరీ నుంచి ప్రతిరోజూ సుమారు 106 కుటుంబాలకు పాలు సరఫరా అవుతున్నాయి. మహాశివరాత్రి మరుసటి రోజు (ఫిబ్రవరి 16) నుండి ఈ పాలు తాగిన వారిలో అస్వస్థత మొదలైంది. బాధితుల్లో ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
-
లక్షణాలు: పాలు తాగిన వెంటనే వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పితో బాధితులు ఆస్పత్రుల్లో చేరారు.
-
వైద్య పరీక్షలు: బాధితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు వారిలో యూరియా, సీరమ్ క్రియాటిన్ స్థాయిలు విపరీతంగా పెరిగినట్లు గుర్తించారు. దీనివల్ల ‘అనూరియా’ (Anuria) అనే పరిస్థితి ఏర్పడి కిడ్నీలు పూర్తిగా పని చేయడం ఆగిపోతున్నాయని వైద్యులు వెల్లడించారు.
ప్రమాదకర రసాయనం ‘ఇథిలీన్ గ్లైకాల్’?
ప్రాథమిక విచారణలో పాలల్లో ‘ఇథిలీన్ గ్లైకాల్’ (Ethylene Glycol) అనే ప్రమాదకర రసాయనం కలిసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా దీనిని కూలెంట్లు లేదా పురుగుమందుల్లో ఉపయోగిస్తారు. పాల కేంద్రం నిర్వాహకుడు అడ్డాల గణేశ్వరరావును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాలు చిక్కగా కనిపించడానికి లేదా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఏవైనా రసాయనాలు కలిపారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ప్రభుత్వ స్పందన – రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధితులందరికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, విజయవాడ నుండి వచ్చిన ప్రత్యేక వైద్య బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి.
