MLA Sanjay Kumar: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. సంజయ్ కుమార్ పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఆయన సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వేసిన ఈ పిటిషన్ చెల్లదని పేర్కొంటూ ఆయనకు క్లీన్చిట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో ఇప్పటివరకు ఎనిమిది మందికి స్పీకర్ నుంచి ఊరట లభించింది.
అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో సాన్నిహిత్యం తీర్పు అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన రాజకీయ వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచానని, ఇప్పటికీ తన వేతనం నుంచి నెలకు రూ. 5,000 పార్టీ లెవీ కింద కట్ అవుతున్నాయని వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, అంతకు మించి వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే, తాను తప్పకుండా పార్టీ ఆదేశాలనే పాటిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: Mohan Babu: మంచు ఫ్యామిలీకి మరో షాక్.. ఏపీలో మోహన్బాబు, విష్ణుపై కేసు
పార్టీ విధేయతపై స్పష్టత తానెప్పుడూ బీఆర్ఎస్ అధిష్టానాన్ని కానీ, పార్టీ విధానాలను కానీ విమర్శించలేదని సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కేవలం స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాల వల్లే కొంత దూరం జరిగినట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని, అందుకోసమే ప్రభుత్వ అండదండలు కోరుతున్నానని ఆయన పునరుద్ఘాటించారు.
