Shruti Haasan: సినిమా తెరపై గ్లామర్ పాత్రలతో అలరించే నటి శృతి హాసన్, నిజజీవితంలో ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి రియల్ లైఫ్ హీరోగా నిలిచింది. చెన్నైకి చెందిన ఆళ్వి అనే చిన్నారి 2023లో జన్మించిన కొద్ది నెలలకే MSMD (మెండీలియన్ ససెప్టిబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్) అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి బారిన పడింది. ఈ వ్యాధి కారణంగా పాప శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించి, 2025 నాటికి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. పాప ప్రాణాలు దక్కాలంటే ఖరీదైన ‘బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్’ (ఎముక మజ్జ మార్పిడి) తప్పనిసరి అని వైద్యులు తేల్చి చెప్పడంతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి శృతి హాసన్ ఆపన్నహస్తం అందించింది.
ఈ క్లిష్ట సమయంలో శృతి హాసన్ కేవలం ఆర్థిక సాయంతో సరిపెట్టకుండా, స్వయంగా రంగంలోకి దిగి పాపకు అత్యుత్తమ వైద్యం అందేలా బాధ్యత తీసుకుంది. దేశంలోని ప్రముఖ స్పెషలిస్టులతో మాట్లాడి, డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స జరిగేలా చూసింది. ముఖ్యంగా గత ఏడాది జూలైలో పాప ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో, శృతి, ఆమె బృందం నిరంతరం ఆ కుటుంబానికి టచ్లో ఉంటూ మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. శృతి చూపిన చొరవతో చికిత్స విజయవంతమై, చిన్నారి ఆళ్వి పూర్తి ఆరోగ్యంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Also Read: D55 update : మారి 2 కాంబో రిపీట్.. ఇద్దరు హీరోయిన్లతో ధనుష్
ఇటీవల కోలుకున్న చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి శృతి హాసన్ను కలిసిన సందర్భంగా ఆ దంపతులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ పాపను కాపాడిన శృతిని దేవుడు పంపిన దూతగా అభివర్ణిస్తూ, ఆమె ఒక సెలబ్రిటీలా కాకుండా తమ ఇంటి మనిషిలా ఆదరించిందని కొనియాడారు. శృతి ఆ పాపతో ఎంతో ప్రేమగా ఆడుకుంటూ బిస్కెట్లు ఇస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆపదలో ఉన్న ఒక నిరుపేద కుటుంబాన్ని అక్కున చేర్చుకుని, ఒక పసిప్రాణాన్ని నిలబెట్టిన శృతి హాసన్ మానవత్వానికి నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు.
View this post on Instagram
