Yadagirigutta: యాదగిరిగుట్ట శివారులో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ట్రాప్ కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. గత 15 రోజులుగా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఈ పులి తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఈ పులి అమ్రాబాద్ అటవీ ప్రాంతం నుంచి ఆడ పులి కోసం బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇటీవల పులి పలు గ్రామాల పరిసరాల్లోకి వచ్చి ఆవులు, మేకలను చంపిన ఘటనలు కూడా నమోదయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పులి సంచారం నేపథ్యంలో యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా, పశువులను సురక్షితంగా ఉంచాలని సూచించారు. అటవీ శాఖ బృందాలు పులి కదలికలను పర్యవేక్షిస్తూ, పరిస్థితిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
