Fire Accident: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి కూకట్పల్లిలోని రాజీవ్ గాంధీ నగర్లో ఉన్న ఒక గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ నింపుతున్న సమయంలో అనుకోకుండా లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలోనే మంటలు భారీగా ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలు పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ సిలిండర్లు ఉన్న చోట మంటలు రావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ముందు జాగ్రత్తగా అధికారులు రీఫిల్లింగ్ సెంటర్ సమీపంలో ఉన్న ప్రజలను వెంటనే ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ప్రమాదం వల్ల ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ అసలు భద్రతా నియమాలు పాటిస్తున్నారా? అసలు గ్యాస్ లీక్ ఎలా జరిగింది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. జనావాసాల మధ్య ఇలాంటి గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లు ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
