Hyderabad: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ సైబర్ మోసగాళ్ల చేతిలో తీవ్రమైన ఆర్థిక మోసానికి గురయ్యారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికిన నేరగాళ్లు ఆమె నుంచి మొత్తం రూ.2.58 కోట్లను దోచుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వార్త బయటకు రావడంతో అందరూ షాక్కు గురవుతున్నారు.
ఊర్మిళకు వాట్సాప్ ద్వారా మోసగాళ్లు ఒక సందేశం పంపి, తాము సూచించే మార్గంలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని వాగ్దానం చేశారు. తర్వాత ఆమెను ‘స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20’ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఈ గ్రూప్లో దినేష్ సింగ్ అనే వ్యక్తి 500 శాతం లాభం ఖాయమని చెబుతూ నమ్మకాన్ని పెంచేందుకు స్క్రీన్షాట్లు కూడా పంపాడు. అదే గ్రూపులో మరో మహిళ లాభాలు వచ్చాయంటూ నటించి మరింత నమ్మించింది.
ఈ నమ్మకంతో ఊర్మిళ, ఆ నేరగాళ్లు సూచించినట్లు ఆపిల్ స్టోర్లో ఉన్నట్లు కనిపించే ‘MCKIEY CM’ అనే నకిలీ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ తరువాత డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు పలు బదిలీల రూపంలో మొత్తం రూ.2.58 కోట్లను ఆ ముఠా చెప్పిన ఖాతాలకు పంపించారు. దీనిలో తన స్వంత బంగారం మాత్రమే కాకుండా భర్త లక్ష్మీనారాయణకు చెందిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి తీసుకున్న డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది.
యాప్లో లాభాలు కనిపిస్తున్నప్పటికీ, డబ్బును వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడంతో తాను మోసపోయానని ఊర్మిళ గ్రహించి వెంటనే విజాగ్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా బాధితురాలు పంపిన డబ్బు మ్యూల్ అకౌంట్లకు మళ్లించబడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ ఖాతాలను ట్రేస్ చేస్తూ, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
